మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 21, న్యూస్ ఇండియా : ఈ వక్ఫ్ సవరణ చట్టం ద్వారా వక్ఫ్ పేరిట భూములు అక్రమంగా తీసుకోవడం ఆగిపోతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ల తో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం సందర్భంగా మాట్లాడుతూ… దేశంలో గుణాత్మకమైన మార్పులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని, సంచలనాత్మక బిల్లులు తెస్తూ ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టంపై పేద ముస్లింలలో అపోహలు సృష్టిస్తూ అల్లర్లు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 12,892 ఎకరాలు వక్ఫ్ భూములుగా నమోదు చేయడం వల్ల వేల మంది రైతులు హక్కులు కోల్పోయారని తెలిపారు. కొండాపూర్ మండలం సైదాపూర్ లో 197 ఎకరాలు వక్ఫ్ జాబితాలో చేరడం వల్ల సుమారు 200 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో పెద్ద ఎత్తున భూములు వక్ఫ్ జాబితాలో చేరాయని ఆరోపించారు. రాష్ట్రంలో పాతబస్తీ వక్ఫ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా వివరాలు ఇవ్వాలనీ, ముతావలీలు ఎవరి పేర్లపై లీజులకు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారి విమర్శలు : "పట్టణాల్లో వక్ఫ్ భూములు ఆక్రమణకు గురవుతున్నా, అసలు లబ్దిదారులైన పేద ముస్లింలకు ఉపయోగం లేకుండా పోతోంది. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. రైతులు, ప్రజలు చట్టంపై అవగాహన పెంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ మౌనాన్ని ప్రజలు గమనిస్తున్నారని" అన్నారు.
Comment List