ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వర్కింగ్ జర్నలిస్టుల గోడు.
కలెక్టరేట్ ప్రాంగణంలో సీనియర్ రిపోర్టర్
జనగాం : డిజిటల్ యుగంలోను వర్కింగ్ జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుధవారం జనగామ కలెక్టరేట్ ప్రాంగణంలో సీనియర్ రిపోర్టర్ పి.జితేందర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ప్రస్తుత డిజిటల్ యుగంలో కూడా వర్కింగ్ జర్నలిస్టులకు అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనప్పటికి పాలకుల నిర్లక్ష్యంతోనే సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా వ్యవహరిస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారో..? పాలకులు చెప్పాలని విలేకర్లు ప్రశ్నించారు. మీడియా రంగంలో ఆయా విభాగాల వద్ద ఉన్న తమ పరిధిలోని సమస్యలను పరిష్కరించకుండా కుంటి సాకులతో వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరి పెట్టుబడి దారుల అడుగులకు మడుగులు వత్తే వారి మాటలను వింటూ కొందరు వర్కింగ్ జర్నలిస్టులకు మాత్రమే పని చేయడం దారుణమని అందరికి న్యాయం చేసే విధంగా ఆయా విభాగాల బాద్యులు పని చేయాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికి ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విలేకర్లు బి.అశోక్, జి.కృష్ణ, వీరస్వామి, జి.దాసు, జె.ఉపేందర్, ఇ.ఓంకార్, సిహెచ్.నవీన్ చారి, గుండా రాజ్, జి.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List