అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు..
ఏడాదిన్నరగా మంజూరైన పరిమిషన్లపై ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఆరా..
జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్రెడ్డి గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అవినీతి అధికారులపై కొరడా ఝళిపించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
*అక్రమ నిర్మాణాలపై..*
*సీఎం రేవంత్రెడ్డి కన్నెర్ర*
*ఏడాదిన్నరగా మంజూరైన పరిమిషన్లపై ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఆరా..*
*గ్రేటర్ పరిధిలోని 6 జోన్లు, 30 సర్కిళ్ల డేటా సేకరణ*
*పూర్తి నివేదిక ఇవ్వాలని కమిషనర్ రోనాల్డ్రోస్ మౌఖిక ఆదేశాలు*
*అధికారుల ఉరుకులు.. పరుగులు*
*అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు*
*గ్రేటర్ హైదరాబాద్, న్యూస్ ఇండియా తెలుగు:* జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్రెడ్డి గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అవినీతి అధికారులపై కొరడా ఝళిపించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ పరిపాలన శాఖలోని రియల్ ఎస్టేట్ రెగ్యూలేటరీ ఆథారిటీ (రేరా) కు డైరెక్టర్గా వ్యహరించిన శివబాలకృష్ణపై ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. సంపాదనకు మించి ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణతో ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులకు చెందిన 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇంకా చాలా మంది హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ప్లానింగ్ సెక్షన్ లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఇంటలీజెన్స్ వర్గాలు సీఎంవో కార్యాలయానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు చాలా మంది అధికారులపై ఏసీబీ దాడులు జరిగే అవకాశాలులేకపోలేదని సమాచారం. దీంతో బల్దియా కమిషనర్ రోనాల్డ్రోస్ జీహెచ్ఎంసీ ప్లానింగ్ విభాగంపై పూర్తి నివేదిక సమర్పించాలని ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లు, 30 సర్కిళ్లలోని అధికారులు గత ఏడాదిన్నరగా జారీ చేసిన పర్మిషన్ల జాబితాను సిద్దం చేస్తున్నారు. కొన్ని జోన్లలో, సర్కిల్ కార్యాలయాలలో ప్లానింగ్ అధికారులు మారినా.. వారి స్థానంలో బాధ్యతులు తీసుకున్న అధికారులు అక్రమ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారనే దానిపై పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేస్తున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. పూర్తి డేటా సేకరించిన తరువాత నేరుగా ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి ఆయా నిర్మాణాలను పరిశీలించనున్నట్లు సమాచారం. అనుమతులకు మించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలతో పాటు బాధ్యులైన అధికారులపై కూడా వేటు వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తూ సంపాదనకు మించి ఆస్తులు కూడబెట్టిన వారి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇంటలీజెన్స్ అధికారుల ద్వారా అవినీతి అధికారుల చిట్టాను రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు గత ప్రభుత్వానికి ఫేవర్ చేసి, రిటైర్డ్ అయిన అధికారులతో పాటు ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన అధికారుల జాబితాను సైతం వేరు వేరుగా సిద్దం చేస్తున్నారు. ఇక కొంత మంది అధికారులు తమపై కూడా దాడులు జరుగుతాయేమోనన్న భయంతో లాంగ్ లీవ్లో వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈస్ట్ జోన్, వేస్ట్ జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అధికారులపై తుదుపరిగా ఏసీబీ దాడులు జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comment List